పయనించే సూర్యుడు జూన్ 4 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
రాజకీయాలకతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు
ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాల పంపిణీ, అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు పొంగులేటి
అర్హులైన నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం మంత్రివర్యులు టి.సి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి పంపిణీ చేసారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల ముఖాలలో ఆనందం చూస్తుంటే తాను భావోద్వేగానికి లోనయ్యానని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన అద్భుతంగా ఉంటుందని అన్నారు. గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ద పేద ప్రజల ఇండ్లపై పెట్ట లేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిందని అన్నారు.22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ప్రజా ప్రభుత్వం ఈ సంవత్సరం కేటాయించిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం అజెండాగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు, చెంచులకు పూర్తి స్థాయిలో మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పెట్టె ప్రతి రూపాయి పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నా మని అన్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.గత పాలకులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయ లకే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంపు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.రైతులకు దాదాపు 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. రైతు భరోసా పథకం క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి 12 వేల రూపాయలకు పెంచామని అన్నారు.
ప్రస్తుతం ప్రజలకు అందించే ఇండ్లు మొదటి విడత మాత్రమేనని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉంటుందని, ఏదులాపురం మున్సిపాలిటీ లో ప్రస్తుతం 520 మందికి ఇల్లులు మంజూరు చేసినట్లు, ఇంకా అర్హులున్నారని, వారికి కూడా ఇస్తామని, నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతుందని మంత్రి తెలిపారు.*జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, నాణ్యమైన ఇల్ల నిర్మాణంపై జిల్లా స్థాయి అధికారి నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు అవసరమైన శిక్షణ అందించామని, పైలెట్ ప్రాజెక్టు క్రింద ముందస్తుగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇప్పటి వరకు 50 ఇండ్లు పూర్తి చేశామని, 500 ఇండ్లు వివిధ దశలలో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇంటి నిర్మాణం పురోగతి ఆధారంగా లబ్దిదారుల ఖాతాలో డబ్బులు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నదని అన్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి విడతలో 17 వేల పైగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు.
ప్రజాధనం భారీగా ప్రభుత్వం వినియోగిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సద్వినియోగం జరిగేలా చూస్తున్నామని, అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండ్లు మంజూరు చేయడం లేదని అన్నారు. పేదలకు ఇండ్లు మంజూరు చేస్తే వారి జీవితంలో మంచి మార్పు వస్తుందని, అటువంటి అవకాశం మంత్రి వర్యులు తనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల కాలంగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు మంజూరు కాలేదని, ప్రజా ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రావు, ఖమ్మం రూరల్ తహసిల్దార్ రాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.