
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 24, అశ్వాపురం: అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, స్థానిక సంస్థల బలోపేతం మరియు గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం పీ డి ఓ ముత్యాల రావు గారు మాట్లాడుతూ, పంచాయతీ రాజ్ వ్యవస్థ దేశ పురోగతికి వెన్నెముక వంటిదని పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పంచాయతీల పాత్ర కీలకమని ఆయన వివరించారు. సర్పంచ్ బానోత్ సదర్ లాల్ గారు మాట్లాడుతూ, అశ్వాపురం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం మరియు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుళ్ళూరి ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి కందిమల్ల శ్రీకాంత్ , వార్డు సభ్యులు వేములపల్లి హసిత, కోర్సా ముత్తమ్మ , కుర్సాం అనసూర్య పాల్గొన్నారు. వీరితో పాటు అంగన్వాడీ టీచర్లు, ఏ.ఎన్.ఎం లు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.