
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 17,అశ్వాపురం:
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో అరైవ్ - అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు అత్యవసర సమయాల్లో ప్రాణ రక్షణ చర్యలపై అధికారులకు, డ్రైవర్లకు మరియు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు జరిగినప్పుడు భయపడకుండా బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండటం వల్ల ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు.సి పి ఆర్ మరియు గోల్డెన్ అవర్ గురించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సంకీర్తన ఈ సందర్భంగా సి పి ఆర్ విధానంపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు.ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) ఎంతో కీలకమని, ఆ సమయంలో అందించే ప్రాథమిక చికిత్స మనిషిని బ్రతికించే అవకాశం ఇస్తుందని వివరించారు.హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు లేదా రోడ్డు ప్రమాదాల్లో శ్వాస ఆగిపోయినప్పుడు సి పి ఆర్ ఏ విధంగా చేయాలో పోలీసులు, ఆటో డ్రైవర్లు మరియు ఇతర శాఖల అధికారులకు ఆమె వివరించి, అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రవీంద్ర రెడ్డి, ఎంపీడీవో ముత్యాల రావు, సీఐ అశోక్ రెడ్డి, డీటీ రాజేశ్వరరావు, ఎస్ఐ ఈ.రాజేష్ పాల్గొని రోడ్డు భద్రతపై దిశానిర్దేశం చేశారు.వీరితో పాటు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గూగులోత్ సుశీల, పంచాయతీ కార్యదర్శి కందిమళ్ళ శ్రీకాంత్, జీపీఓ లక్ష్మణ్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె కేశవ రెడ్డి, మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, ఓరుగంటి రమేష్ బాబు, తుర్రంవారిగూడెం సర్పంచ్ కుంజా జాన్, ఉపసర్పంచ్ హర్ష నాయక్, ఆటో డ్రైవర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
