పయనించే సూర్యుడు న్యూస్ జులై 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కదిలించే కథనాలను రాసే కలం కన్నీటి చుక్కలను రాల్చుతూ ఒరిగిపోయింది. కుటుంబం దిక్కులేనిది అయింది. యాజమాన్యాలు, ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. జై కొట్టిన జనాలు నాలుగు సంతాప సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చేతులు దులుపుకున్నాయి. జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు. భరోసా.. భద్రతలేని ఉద్యోగాలు. భార్యల మీద ఈసమెత్తు బంగారం ఉండదు. అద్దె ఇల్లు.. చనిపోతే శవాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని దుస్థితి. సిరిసిల్ల టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కుటుంబ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఒక బాబు ఉన్నాడు. వీరి భవిష్యత్ ఏంటో ఆలోచిస్తేనే బాధనిపిస్తుంది. సొంత ఇల్లులేదు. సొంత ఊళ్లో జాగలేదు. సిరిసిల్లలో అద్దె ఇంట్లో జీవనం సాగించిన ఆయన శవం బంధువుల ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వాహించాల్సిన పరిస్థితి. కొడుకు మృతదేహం వద్ద తల్లి రోదిస్తూ ‘కొడుకా ఒక్క రూపాయి సంపాదించుకోలేదు. పూల దండలు సంపాదించుకుంటున్నవారా? కొడుకా.. నీ పిల్లల బతుకు ఏం కావాలిరా.. మాకు అగ్గి పెడుతావనుకుంటే.. మేం నీకు అగ్గిపెట్టాల్సి వస్తుంది కొడుకా..’ అంటూ ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయింది. జర్నలిస్టు మిత్రులు వృత్తిపరంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దిక్కుతోచక తనువు చాలిస్తున్నారు.పాత్రికేయ మిత్రులు, నెలవారీ జీతంలేని జర్నలిస్టులు ఆలోచించాలి. ఇతర ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లోకి మారిపోవాలి . భార్యాపిల్లల్ని కాపాడుకోవాలి. జర్నలిజం తిండి పెట్టదని తెలుసుకోండి. ఆ ఊబి నుంచి బయటికి వచ్చి స్వయం శక్తితో జీవించేందుకు ప్రయత్నించండి. కాసింత గౌరవమైన మిగులుతుంది. కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది.