పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
ఐపీఎల్ 2024లో వరుస విజయాలతో ఫైనల్ వరకూ దూసుకెళ్లి, టైటిల్ ఫేవరెట్ ట్యాగ్తో ఐపీఎల్ 2025లోకి అడుగుపెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ గల్లీ ఆట ప్రదర్శన చేస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ టీమ్.. తొలి మ్యాచ్లో మినహా మళ్లీ గెలుపు మొహం చూడ లేదు. తాజాగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీలో వరుస గా నాలుగో మ్యాచ్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో పదో స్థానాన్ని పదిలం చేసుకుంది. అటు గుజరాత్ హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో ప్లేసుకు దూసుకొచ్చింది.. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఎస్ ఆర్హెచ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అయితే మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో సన్రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో.. 152/8కే పరిమితమైంది. ట్రావిస్ హెడ్ 8అభిషేక్ శర్మ 18, ఇషాన్ కిషన్ 17, నితీశ్ రెడ్డి 31 క్లాసెన్ 27, అనికేత్ వర్మ 18ఎవరూ కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. తొలుత ఆచీతూచి బ్యాటింగ్ చేసింది. నాలుగు ఓవర్లు ముగిసే సరికి 17/2తో నిలిచింది. ఓపెనర్ సాయి సుదర్శన్తో పాటు, జోస్ బట్లర్ 0 విఫలమయ్యాడు. ఈ దశలో శుభ్మన్ గిల్ 43 బంతుల్లో 61 రన్స్ నాటౌట్కు వాషింగ్టన్ సుందర్ 29 బంతుల్లో 49 రన్స్ జత కలిశాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సుందర్కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ బ్యాటింగ్లో మాత్రం అతడు అదరగొట్టాడు. వీరిద్దరి దెబ్బకు గుజరాత్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో షెర్ఫానే రుథర్ఫోర్డ్ 16 బంతుల్లో 35 రన్స్ సత్తాచాటడంతో గుజరాత్.. 16.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.