పయనించే సూర్యుడు న్యూస్ : రామగిరి, సెంటినరీకాలనీ:-18... రామగుండం-3 & అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సి.ఎన్.సి.ఓ.ఏ. క్లబ్ నందు రామగుండం-3 ఏరియా సేవా, లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అలివేణి సుధాకర రావు, విజయలక్ష్మీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన బొమ్మల కొలువు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, పర్సనల్ జి.వెంకటేశ్వర రెడ్డి సతీమణి సునీత వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. వేడుకలలో భాగంగా ముందుగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల సాంప్రదాయంగా నిర్వహించే ఈ బొమ్మల కొలువు వేడుకలు ఇప్పటికీ ఏ మాత్రం వన్నె తగ్గకుండా మహిళలందరూ ఉత్సాహంగా నిర్వహించుకోవడం చాలా సంతోషమని అన్నారు. ఇది మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప సాంప్రదాయమని, దీనిని భవిష్యత్ తరాల వారికి కూడా అందజేయడం మనందరి బాధ్యత అని అన్నారు. తద్వారా సంస్కృతి, సాంప్రదాయాలు చిరకాలం వర్ధిల్లుతాయని అన్నారు. ప్రస్తుత జీవన శైలిని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి సంప్రదాయాలను కొనసాగించడం ద్వారా ముందు తరాల వారు సన్మార్గంలో నడుస్తారన్నారు. ఇలాంటి వేడుకల్లో పాల్గొనేందుకు పిల్లలను, తోటి మహిళలను ప్రోత్సహించాలన్నారు. ఈ వేడుకలలో భాగంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొని, వివిధ రకాల బొమ్మలను చక్కగా అలంకరించిన మహిళలందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సరం వేడుకలలో ప్రత్యేకంగా ప్రకృతి సోయగాల నడుమ కొలువైన ఏడుకొండల వెంకన్న నేపథ్యంతో చేసిన అలంకరణ అందరినీ ఆకట్టుకుందన్నారు. ఇదే ఉత్సాహంతో మన్ముందు మరిన్ని వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు. బొమ్మల కొలువులో భాగంగా గోదా కల్యాణం ఘట్టం, ఆదివరాహ స్వామి, లక్ష్మీనరసింహా స్వామి, వినాయకుడు, కృష్ణుడు, తదితర దేవీ దేవతల విగ్రహాలు మరియు ఇతర అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి.అంతేకాకుండా క్లబ్ పరిసరాలలో వేసిన రంగవల్లులు, పల్లె ప్రజల జీవన విధానాన్ని తెలియజేసే వివిధ ఏర్పాట్లు ఆవరణకు అందాన్ని తెచ్చిపెట్టాయి.పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణులను కాపాడటం లాంటి అంశాలతో ఏర్పాటు చేసిన బొమ్మలు అవగాహన కల్పించేలా ఉన్నాయి. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో లేడీస్ క్లబ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులను ప్రధానం చేసారు.ఈ కార్యక్రమంలో ఆర్జీ-1,2 ఏరియాల సేవా అధ్యక్షురాల్లు అనిత లలిత్ కుమార్, వనజా వెంకటయ్య, లలితా గుప్త, లేడీస్ క్లబ్ కార్యదర్శి సి.హెచ్.గీతారాణి, సంయుక్త కార్యదర్శి హరిణి, కోశాధికారి ప్రసూన, కమిటీ సభ్యులు లావణ్య, నిఖిత , కోమలి లతో పాటు లేడీస్ క్లబ్ సభ్యులు, సేవా సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.