
అసెంబ్లీ ముట్టడి కోసం షాద్ నగర్ పోలీసుల ముందస్తు చర్యలు..
ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేరేందుకు జైలుకెళ్ళడానికైనా సిద్ధమే..
(పయనించే సూర్యుడు మార్చి 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ ఈనెల 30న అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల పిలుపుకు ప్రభుత్వం స్పందించి ముందస్తు చర్యలను చేపట్టింది. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీసులు తెలంగాణ ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు,మాజీ జెడ్పిటిసి పి వెంకటరామ్ రెడ్డి,సీనియర్ జర్నలిస్టు వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఎండి ఖాజాపాషా (కేపి)లను ముందస్తు అరెస్టులు చేశారు. వారి ఇళ్ల వద్ద నుండి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ప్రకారం స్థానిక పోలీసులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు పలువుని అరెస్టు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు,కాంగ్రెస్ నాయకుడు పి. వెంకట్రాంరెడ్డి, జర్నలిస్ట్ కేపీలు పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించింఛాయనీ, అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు, హెల్త్ కార్డులు, 250 చదరపు గజాల ఇంటి స్థలం, రూ.25 వేల గౌరవ పెన్షన్ అందజేస్తామని, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యమకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. ఉద్యమకారులకు సంక్షేమ ఫలాలు దక్కడానికి తాము జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యమకారులకు భయపడి అరెస్టులకు పాల్పడడం హాస్యాస్పదమని అన్నారు. ఉద్యమకారులు పినపాక ప్రభాకర్, మన్నె నారాయణ, రాజ్యలక్ష్మి, సిరాజుద్దీన్ తదితరులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు..
