
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: తానూర్ మండలం: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తానూర్ మండలంలోని జవ్లా-బి గ్రామంలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను *ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కోలూర్ గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గతంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే ప్రజలు పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం గ్రామాలకే వైద్య సేవలు చేరేలా ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.తానూర్ మండల అభివృద్ధికి అత్యంత కీలకమైన 27 ప్యాకేజ్ పనులు పూర్తయితే మండలం పూర్తిగా సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాగునీటి వసతులు మెరుగుపడి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని, రైతుల ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఈ అంశాలను తాను పలుమార్లు తెలంగాణ శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.వ్యవసాయాభివృద్ధికి గ్రామీణ రహదారులు కూడా ఎంతో కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే, రైతులు తమ పంట పొలాలకు సులభంగా వెళ్లేందుకు అవసరమైన వ్యవసాయ రహదారులను కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించుకోవాలని సూచించారు. రైతులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.గ్రామాల అభివృద్ధికి విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య శాఖ సిబ్బంది, మండల నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.