
ఆమె ఆశయ అడుగుజాడల్లో కొనసాగుతాం
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి పూలే వర్ధంతి వేడుకలు
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఆకాష్ నాయక్
( పయనించే సూర్యుడు మార్చి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
సావిత్రిబాయి ఫూలే వర్ధంతి పురస్కరించుకుని షాద్నగర్ పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న ఆమె విగ్రహానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆకాష్ నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… భారత తొలి మహిళా గురువుగా పేరుగాంచిన సావిత్రి పూలే మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలని అన్నారు. మహిళలు చదువుకోవడం కూడా నిషేధంగా ఉన్న కాలంలో బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించి సమాజంలో విద్యా వెలుగులు నింపిన గొప్ప సంస్కర్తగా నిలిచారని తెలిపారు.దళితులు, అణగారిన వర్గాలకు విద్య మరియు సమాన హక్కులు కల్పించేందుకు ఆమె జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, విధవల సంక్షేమం, కుల వివక్ష నిర్మూలన కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.నేటి యువత సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మహిళా విద్య,సామాజిక సమానత్వం, సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.