
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని మరోసారి చాటిచెప్పే హృదయాన్ని కదిలించే సంఘటన కూకట్ పల్లిలో చోటుచేసు కుంది. కుత్బుల్లాపూర్కు చెందిన ఆశ అనే మైనారిటీ యువతి పుట్టుకతోనే కుడిచేయి చిన్నగా ఉండటంతో ఎన్నో సంవత్సరాలుగా రోజువారీ పనుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పరిస్థితిని గమనించిన తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ వెంటనే స్పందించి సహాయానికి ముందుకొచ్చారు. సమస్యను గంభీరంగా తీసుకున్న ఆయన, భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసతి కేంద్రం ట్రస్ట్ను సంప్రదించి, ఆశకు ఆర్టిఫిషియల్ రైట్ హ్యాండ్ అందేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. శివకృష్ణ చొరవతో ఆశకు కృత్రిమ చేయి అందడంతో ఆమె జీవితంలో నిజంగా కొత్త వెలుగు నిండింది. ఇప్పటివరకు కష్టంగా అనిపించిన అనేక పనులు ఇప్పుడు సులభంగా చేసుకునే స్థితి ఏర్పడింది. ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, ఈ సహాయం విలువను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ
“సమాజంలో ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారు చాలామంది ఉన్నారు. దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలి. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగ మహిళలకు విద్య, ఉపాధి, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆశ వివాహానికి ఆర్థిక సహాయం అందించాలని కూడా ఆయన దాతలను మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ కేంద్రం ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర, కూకట్ పల్లి సీనియర్ జర్నలిస్టు నాగరాజు, జినుక రఘు సంధ్య, టెక్నీషియన్ రఘు, మధు, స్వామి తదితరులు పాల్గొన్నారు. మనిషి మనసుంటే మార్పు సాధ్యమే… ఒక చేయి అందిస్తే, ఒక జీవితం వెలుగుతుంది!
