పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
వ్యవసాయ వర్సిటీలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల
రైతు వేదికలలో ఏర్పాట్లపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 1,034 రైతు వేదికల్లో 'రైతునేస్తం'కార్యక్రమం ప్రారంభం కానుంది.
సాయంత్రం నాలుగు గంటలకు ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం యూనివర్సిటీ ఆడిటోరియంలో అధికారులతో కలసి సమీక్షించారు. రైతు వేదికలలో చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లకు మంత్రి తుమ్మల పలు ఆదేశాలు జారీ చేశారు. రైతునేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికలలో ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేశామని, విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో దాదాపు 1,500 మంది రైతులు పాల్గొంటారని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తెలిపారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఇప్పటికే 566 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించామని, ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, వ్యవసాయరంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు తెలియజేస్తున్నామని తెలిపారు.ఇప్పటి వరకు 6.35 లక్షల మంది రైతులు ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు ఇతర రైతుల అనుభవాలను తెలుసుకొన్నారని చెప్పారు. తాజాగా ఈ 'వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని', మరొక 1,034 రైతు వేదికలకు కల్పించబోతున్నామని, వీటిని ప్రారంభించాల్సిందిగా సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను వ్యవసాయ శాఖ తరఫున ఆహ్వానించామని తెలిపారు. కాగా, రైతు వేదికలకు హాజరైన రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడనున్నట్లు తుమ్మల తెలిపారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల విజ్ఙప్తి చేశారు.