పయనించే సూర్యుడు. మార్చి 2. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం : ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను మార్చి నెలాఖరు లోగా స్క్రూటినీ పూర్తి చేసి పరిష్కరించేలా చూడాలని అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఎల్.ఆర్.ఎస్. పై సంబంధిత అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లు మాట్లాడుతూ పెండింగ్ ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల స్క్రూటినీ కోసం అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి బృందంలో నీటి పారుదల శాఖ అధికారి, రెవెన్యూ అధికారి, టౌన్ ప్లానింగ్, సంబంధిత అధికారులు ఉండాలని అన్నారు. మండలంలో అవసరమైన మేర లాగిన్ అందించడం జరుగుతుందని, అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకొని ప్రతి రోజూ ఎన్ని దరఖాస్తులు స్క్రూటినీ జరుగుతుందో లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అన్నారు. భూ క్రమబద్ధీకరణలో భాగంగా ప్రభుత్వ భూములలో, నీటి వనరుల ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో క్రమబద్ధీకరణకు అనుమతించరాదని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ధృవీకరణ చేయాలని, బృందంలో ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తును పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.భూ క్రమబద్ధీకరణలో ఎక్కడైనా అవతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఎల్.ఆర్.ఎస్. స్క్రూటినీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ మార్చి 31 లోపు ప్రభుత్వం అందించే రాయితీ నియోగించుకునేలా చూడాలని అన్నారు. అనంతరం మండలాల వారిగా అదనపు కలెక్టర్ సమీక్షించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించి, సందేహాలను నివృత్తి చేసారు. ఈ సమావేశంలో డిపిఓ ఆశాలత, డిఎల్పీఓ రాంబాబు, ఖమ్మం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ షఫీయుల్లా, తహసీల్దార్ లు, ఎంపిడిఓ, నీటి పారుదల శాఖ, టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.