
పేద విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడొద్దు. సీపీఐ(ఎం) వైరా కార్యదర్శి భూక్యా వీరభద్రం
పయనించే సూర్యుడు నవంబర్ 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ నేపథ్యంలో భూక్యా వీరభద్రం వైరా లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.8 వేల కోట్లకుపైగా ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి.బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు కనీసం వారు ఇచ్చిన టోకెన్ల నిధులు కూడా ఇవ్వలేదన్నారు. గతం లో విద్యాసంస్థల యాజామన్యాలు బంద్ ప్రకటించి సంవత్సరం కాలంగా పోరాడితే రూ.1200 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ప్రభుత్వ మాట తప్పడంతో మళ్లీ విద్యాసంస్థలు బంద్ చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. విద్యాసంస్థలు బంద్ పాటించడంతో పేద పిల్లల తమ చదువులను నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. పేద విద్యార్థులు తమ విద్యను నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. స్వయాన విద్యాశాఖ ను ముఖ్యమంత్రి వద్దే ఉంచుకొని పేద విద్యార్థులకు భరోసా లేకుండా చేశారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఫీజుల చెల్లింపు కోసం గ్యారంటీ ఇచ్చి.. భవిష్యత్ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం లాగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఈ విధానాలే అనుసరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని విమర్శించారు, స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం కాకుండా ఇవాళ వాటిని విడుదల చేయాలని అడుగుతున్న ప్రైవేటు యాజమాన్యాల పైన విజిలెన్స్ దాడుల పేరుతో బెదిరిస్తున్నారని ఇది చాలా దుర్మార్గమని ఆయన అన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో విద్యార్థులు తల్లిదండ్రులు కలుపుకొని సిపి(ఐ)ఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.