
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ముధోల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ఈ రోజు బాసర, ముధోల్ మండల కేంద్రలలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.బాసర మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, అనంతరం ముధోల్ మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనానికి శంకుస్థాపన మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిధులతో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన నూతన వాహనాలను ప్రారంభించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక గృహ నిర్మాణ పథకమైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టి ఆధునీకరించిన పోస్టుమార్టం గదులను పునఃప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన నూతన బోర్వెల్ను కూడా ప్రారంభించారు. ముధోల్ లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు, మౌలిక వసతులు, పారిశుధ్య సదుపాయాలు, తాగునీటి సౌకర్యాలు అందించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.