
పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠని కోరారు. హైదరాబాద్కు వచ్చిన కలశ్రేష్ఠ.. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని సీఎం కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారులు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై చర్చించారు.అలాగే, గతంలో అత్యధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలకు సంబంధించి రుణ పునర్వ్యవ్యస్థీకరణ అంశాన్ని పరిశీలించాలని సీఎం హడ్కో ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్వాచారు. ఈ విషయంపై హుడ్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. సానుకూల వృద్ది రేటుతో ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీరేటుతో దీర్ఘ కాల రుణాలు ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని హడ్కో ఛైర్మన్ తెలియజేశారు. మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు వేగంగా మంజూరుపై కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉండగా, ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరుకావాలని ఈ సందర్భంగా హడ్కో ఛైర్మన్ను ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.