పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2025, సెప్టెంబర్ 30 లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ దాఖలైన 6 పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై 2025, జూన్ 23న హైకోర్టు ఇరువర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కోరింది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనల అనంతరం బుధవారం (జూన్ 25) జస్టిస్ టి.మాధవిదేవి తీర్పు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని.. 2025, సెప్టెంబర్ 30లోగా అంటే మూడు నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని ఆదేశించారు. 30 రోజుల్లోగా వార్డుల విభజన చేయాలని సూచించారు. తెలంగాణలో 2024, జనవరి 31తో సర్పంచుల పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. దాదాపు 15 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తాజా ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలు కానుంది.