
పయనించే సూర్యుడు న్యూస్ :రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణమంటే సామాన్యం కాదని చెప్పారు. శుక్రవారం అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు ఆమె శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఒకే చోట ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదు అన్నారు. భవిష్యత్లో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారన్నారు. రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కొనియాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు పెద్ద త్యాగం చేశారని తెలిపారు. అలాంటి వారికి సమస్యలు రాకుండా సేవలందించడం బ్యాంకుల ప్రథమ బాధ్యత అన్నారు. రైతుల పంట రవాణాకు ప్రత్యేక రైళ్లు వెళ్తున్నాయని, మహారాష్ట్ర నుంచి అరటికాయలు, తమిళనాడు నుంచి కొబ్బరి రవాణా అవుతున్నాయని పేర్కొన్నారు. కూరగాయలు, పండ్లకు ఏపీని హబ్గా చేసి, ఉత్పత్తుల రవాణాకు సీఎం ఆలోచిస్తున్నారని తెలిపారు. అందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటును ఇవ్వాలని సూచించారు. అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న సీఎంను చూసి అంతా గర్వపడాలన్నారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని నిర్మలా సీతారామన్ అన్నారు.