పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 14 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ వచ్చే నెలలోనే ఉంటాయని సీఎం సంకేతాలు క్లీన్స్వీప్ లక్ష్యంగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం.. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశం అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సూచన సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల మధ్య పది .పది హేను రోజుల గ్యాప్ ఆ తర్వాత జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ హైదరాబాద్, స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతున్నది. వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసేలా కష్టపడి పని చేయాలని నేతలకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఈ టాస్క్ను ప్రతి ఎమ్మెల్యే, మంత్రి సక్సెస్ చేయాలని.. ఇందుకు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్చైర్మన్లు, పార్టీ లీడర్లు సహకరించాలని సూచించారు. ఈ ఎన్నికలు ఏడాదిన్నర ప్రభుత్వ పనితీరుకు పరీక్ష లాంటివని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పినట్టు తెలిసింది. క్యాడర్తో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు కూడా నియోజకవర్గాల బాట పట్టారు. లోకల్బాడీ ఎన్నికల టాస్క్ను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్రెడ్డి అప్పగించారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు కాస్త లేట్అయినా 100 శాతం కొట్టి తీరాలని, క్లీన్స్వీప్ చేయాలని అన్నట్టు తెలిసింది.''జిల్లా మంత్రులు, ఇన్చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను గడపగడపకూ చేర్చాలి. ఈ నెల చివరి వారం కల్లా నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలను ఎమ్మెల్యేలు చుట్టి రావాలి. ఇక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుంచి కౌన్సిలర్లు, వార్డు మెంబర్ల దాకా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలి. పార్టీ కోసం ముందు నుంచి పనిచేసినోళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెబల్స్ అనే మాట రాకుండా, అప్రమత్తంగా ఉంటేనే వందకు వందశాతం క్లీన్స్వీప్ చేయగలం' అని చెప్పి నట్టు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను రూపొందించేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం చెప్పడంతో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఇప్పటికే నియోజకవర్గాల్లో పాగా వేశారు. క్యాడర్తో సంప్రదింపులు కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో తిరుగుతూ శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీలో ఏది ముందు సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏవి ముందు జరిగినా.. వీటి మధ్య కేవలం 10- నుంచి15 రోజుల వ్యవధి మాత్రమే ఉండనున్నట్టు తెలిసింది. ఆ తర్వాతే జడ్పీటీసీ, మున్సిపల్ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. సర్పంచ్ఎన్నికల్లో పార్టీ సింబల్ఉండదు. ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తే అధికార పార్టీకి లాభం అనే చర్చ కాంగ్రెస్వర్గాల్లో జరుగుతున్నది. దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కాగా, ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించి, ఆ తర్వాతే ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రస్థాయిలో ఎదుర్కోనున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేయడంతో పాటు పీసీసీ కార్యవర్గాన్ని సైతం ప్రకటించడంతో కాంగ్రెస్క్యాడర్జోష్మీద ఉంది. దీనికితోడు పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. లోకల్బాడీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా రివ్యూలు నిర్వహిస్తూ అటు లీడర్లను, క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపడ్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు.ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు..
లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సర్కార్ నుంచి ఇటీవల ఆదేశాలు అందాయి. దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసింది. కేవలం రిజర్వేషన్లు, నోటిఫికేషన్ తేదీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచిచూస్తున్నది. కాగా, ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే తాజాగా ఎన్నికలు జరుగుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గరే పెండింగ్లో ఉంది. అది ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో చట్ట ప్రకారం బీసీలకు 23 శాతం వరకు సీట్లు కేటాయించినా.. ఓపెన్ కేటగిరీలో మిగిలిన సీట్లను కేటాయించనున్నట్టు తెలిసింది.