
{పయనించే సూర్యుడు} {జనవరి 6 మక్తల్}
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా, ప్రజలు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భద్రతా భరోసా కల్పించే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. గురువారం సాయంత్రం మక్తల్ లో సర్కిల్ పోలీసులు, టి ఎస్ ఎస్ పి. బెటాలియన్ల పోలీసులతో కలిసి భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ మక్తల్ పోలీస్ స్టేషన్ నుండి అజాద్ నగర్ చౌక్ యాదవ్ నగర్ , గుంతల గేరి, మారుతి నగర్, నేతాజీ నగర్, నారాయణపేట రోడ్డు, సంగంబండ రోడ్డు నుండి పోలీస్ స్టేషన్ వరకు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మక్తల్ సీఐ రామ్ లాల్ మాట్లాడుతూ… మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు, ఎన్నికల సమయంలో ఎవరూ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజల్లో నమ్మకం, భద్రతా భావం పెరుగుతుందని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని సిఐ స్పష్టం చేశారు.ఈ ప్లగ్ మార్చ్ లో ఎస్ఐ లు భాగ్య లక్ష్మి రెడ్డి, ఎస్ ఎం. నవీద్, అశోక్ బాబు, రమేష్, రేవతి, మక్తల్ పోలీసులు, టి ఎస్ ఎస్ పి. బెటాలియన్ పోలీసులు తది తరులు పాల్గొన్నారు.
