పయనించే సూర్యుడు జూన్ 24. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
హాట్ స్పాట్ లలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు
ప్రతి రోజూ పిల్లలకు పాఠశాల ప్రేయర్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన
సీజనల్ వ్యాధుల నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నాడు, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి సీజనల్ వ్యాధుల నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. బి. కళావతి బాయి వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అధికంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందని, వీటి నియంత్రణకు ప్రణాళిక ప్రకారం పని చేయాలని తెలిపారు.సీజనల్ వ్యాధులు అధికంగా అవగాహన లేకుండా ఉండడం వలన, సరైన పారిశుధ్యం లేని ప్రాంతాలలో అధికంగా వస్తుంటాయని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులను పూర్తి స్థాయిలో నియంత్రించగలమని అన్నారు. చికిత్స కంటే, నివారణ ఎంతో మేలని కలెక్టర్ అన్నారు.ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం వల్ల డయేరియా అధికంగా వస్తుందని, ఇది పిల్లలకు తొందరగా అటాక్ అవుతుందని అన్నారు. ప్రతి పి.హెచ్.సి., సబ్ సెంటర్ ల వద్ద అవసరానికి మించి 10 శాతం బఫర్ స్టాక్ తో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టాలని అన్నారు.
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి రోజూ ఉదయం ప్రేయర్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో దీనిపై చర్చ పెట్టాలని అన్నారు.గత సంవత్సరం అధికంగా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా ఎంపిక చేసి అక్కడ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల వద్ద ఎటువంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తి జరగకుండా స్పెషల్ శానిటేషన్ బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు స్టాక్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని, తక్కువ ఉంటే వెంటనే దృష్టికి తీసుకొని రావాలని అన్నారు.
డెంగ్యూ వైరస్ సాంపిల్స్ టెస్టింగ్ విస్తృతంగా చేయాలని అన్నారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆసుపత్రులలో టెస్టింగ్ చేయాలని, ప్రతి ఏరియా ఆసుపత్రి, పి.హెచ్.సి వద్ద అవసరమైన కిట్లు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు.జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ లో ప్రత్యేక పారిశుధ్య చర్యలను ప్రతి వారం వర్షా కాలం సీజన్ ముగిసే వరకు చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం ఇంటింటికి వెళ్లి నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పారిశుద్ద్య జాగ్రత్తలు పాటించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. పాత కూలర్లు, కొబ్బరి బోండాలు, పగిలిన కుండలు, ఉపయోగం లో లేని పాత్రలు, టైర్ లలో నీరు నిల్వ ఉండకుండా చూసు కోవాలని, సీజనల్ వ్యాధులను గత ఏడాది నుంచి ఇప్పటికి ఎంత తగ్గించామనే అంశం పై మన పని తీరు ఆధారపడి ఉంటుందని అన్నారు.సమీక్ష లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ హాస్టల్స్, కేజిబీవీ ప్రభుత్వ పాఠశాలల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని అన్నారు. 7, 8 వ తరగతి పిల్లలతో సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ కమీటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కళావతి బాయి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.