పయనించే సూర్యుడు న్యూస్(ఆగస్టు.28/08/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో గురువారం టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష శిబిరం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు,మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో దాసు కుప్పం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ పర్యవేక్షణలో స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్,నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టివిడి.ప్రత్యూష,డాక్టర్ ఎం.లలిత్ వైద్య బృందం రోగులను పరీక్షించారు.ఇందులో భాగంగా బిపి,షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు,పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు,మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.అంతకుమునుపు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు,ముందస్తు నివారణ చర్యలపై చిత్రపటాల ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత,పిఆర్ఓ చంద్రమోహన్,గ్రామ సర్పంచ్ ఎ.రవిరెడ్డి ఎంపిహెచ్ఈవో సుబ్రహ్మణ్యం,సూపర్వైజర్ ఎం.మురళి, ఏఎన్ఎంలు,ఎంఎల్ హెచ్ పిలు,ఆశాలు పాల్గొన్నారు.