
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి భైంసా పట్టణం మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు ప్రభుత్వం మరో అరుదైన అవకాశాన్ని కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల, భైంసాలో బి.కాం (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు బీమా) నూతన కోర్సుకు అనుమతి లభించింది.ఈ కోర్సు అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ విధానంలో అమలు కానుండటంతో విద్యార్థులు డిగ్రీ చదువుతో పాటు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందే అవకాశం కలుగనుంది. దీంతో విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు కార్యాచరణ అనుభవం కూడా లభించనుంది.ప్రత్యేకంగా బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సేవల సంస్థలు మరియు ఇతర వ్యాపార రంగాల్లో అవసరమైన నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా విద్యార్థులు నేర్చుకోగలరు. డిగ్రీ చివరి సంవత్సరంలో శిక్షణ పొందే విద్యార్థులకు నెలవారీ ఉపకార వేతనం అందే అవకాశం కూడా ఉంది.ప్రస్తుతం విద్యార్హతలతో పాటు అనుభవానికి అధిక ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సు విద్యార్థులకు ఉన్నత ఉపాధి అవకాశాలను కల్పించనుంది. డిగ్రీ పూర్తి చేసే నాటికి విద్యార్థులు ఉద్యోగ రంగానికి సిద్ధంగా ఉండేలా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కర్రోళ్ళ బుచ్చయ్య గారు నూతన కోర్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుతో పాటు శిక్షణ, శిక్షణతో పాటు అనుభవం, అనుభవంతో పాటు ఉపాధి అవకాశాలను అందించే ఈ నూతన కోర్సు భైంసా ప్రాంత విద్యార్థులకు వరంగా మారనుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.