
పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం:ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో, ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం పర్యటించిన కలెక్టర్ అకాడమిక్ బ్లాక్ రిపేర్ వర్క్స్, ఆడిటోరియం మరమ్మత్తులు, బాలుర కామన్ మెస్ మరియు బాలికల హాస్టల్ పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత శాఖలతో వివరంగా చర్చించారు. ఆడిటోరియంలో మౌలిక వసతులు, సీటింగ్ ఏర్పాట్లు, స్టేజ్ సెటప్, లైటింగ్, ఎలక్ట్రికల్ పనులు వంటి అంశాలన్నీ నాణ్యతతో పూర్తవ్వాలని ఆయన సూచించారు.యూనివర్సిటీ పాత మరియు కొత్త భవనాల సుందరీ కరణ, పార్కింగ్ ప్రాంతాల అభివృద్ధి, క్యాంపస్ అంతటా పరిశుభ్రత, లైటింగ్ పనులను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు–సలహాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రారంభించే శిలాఫలకం ఏర్పాట్లను కూడా పరిశీలించి, దాని వద్ద ఏర్పాట్లు ఆకర్షణీయంగా, సముచిత ప్రమాణాలతో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల వసతి గృహాల్లో ఫర్నిచర్ అమరిక, నీటి సదుపాయాలు, శౌచాలయాల మరమ్మత్తులు, వసతి ప్రాంతాల పరిశుభ్రత వంటి అంశాలను కూడా ఆయన సమీక్షించారు. క్యాంపస్ ఆవరణ మొత్తం పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కళాశాల ప్రిన్సిపల్ డా. జగన్మోహన్ రాజును కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యూనివర్సిటీ ప్రారంభోత్సవం జిల్లాకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమని, అన్ని ఏర్పాట్లు అత్యున్నత నాణ్యతతో పూర్తవ్వాలని సూచించారు. విద్యా రంగంలో జిల్లాకు ఇది ఒక ప్రధాన మైలురాయి అవుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అన్ని శాఖల సమిష్టి బాధ్యత అని స్పష్టం చేశారు. అధికారులు అత్యంత వేగం మరియు శ్రద్ధతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాస్, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.