
పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం:అన్నపురెడ్డిపల్లి చంద్రుగొండ కొత్తగూడెం మండలాల్లోని మీసేవ కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను పరిశీలించేందుకు గురువారం ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు మరియు తెలంగాణ గ్రీవెన్స్ అండ్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ (TGTS) జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.మీసేవ కేంద్రాల నిర్వహణ, శుభ్రత, సాంకేతిక వసతులు, సిబ్బంది ప్రవర్తన, సేవల వేగం వంటి అంశాలను వారు సమగ్రంగా పరిశీలించారు. కేంద్రాలకు వచ్చే ప్రజలు సమర్పిస్తున్న దరఖాస్తులు ముఖ్యంగా ఆదాయ ధ్రువపత్రాలు, మౌలిక వృత్తి ధ్రువపత్రాలు, రేషన్ కార్డులు, జనన/మరణ ధ్రువపత్రాలు, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు — వాటి ప్రాసెసింగ్ స్థితిని కూడా వివరంగా పరిశీలించారు.మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రామాణిక రుసుముల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. సూచిక బోర్డులు, సేవల జాబితా, సేవలకు సంబంధించిన రుసుముల వివరాలు కేంద్రంలో స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక రుసుములు వసూలు చేయరాదని, అలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలను ఎట్టి విధంగానూ మోసగించకూడదనీ, పారదర్శకతతో సేవలు అందించాలనీ, ప్రతి వినియోగదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.