
పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలు, ప్రజాదర్బార్తో పాటు పలు కీలక కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా.. నవంబర్ 25వ తేదీన ఆయన మధ్యాహ్నం బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో కడప జిల్లాలోని పులివెందులకు చేరుకుంటారు. పులివెందులకు చేరుకున్న అనంతరం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశమై వారి సమస్యలను, వినతులను స్వీకరించనున్నారు. నవంబర్ 26వ తేదీన ఆయన పూర్తి స్థాయిలో ప్రైవేట్ కార్యక్రమాలకు కేటాయించారు. 26వ తేదీన ఆయన స్థానిక నాయకులకు సంబంధించిన వివాహ వేడుకకు హాజరవనున్నారు. దీంతో పాటు పలువురిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడనున్నారు. అనంతరం, పర్యటన ముగించుకుని నవంబర్ 27వ తేదీన పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి బెంగళూరుకు పయనం కానున్నారు. మూడు రోజుల ఈ పర్యటన నేపథ్యంలో పులివెందులలోని క్యాంప్ కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.