
అధికారులు తీరు మార్చుకోవాలి
గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి
పయనించే సూర్యుడు; ఏప్రిల్ 21: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ. నూగూరు వెంకటాపురం:
ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించకుండా, ఏజెన్సీలో ఉన్న ప్రత్యేక చట్టాలను గౌరవిస్తూ, ఆదివాసీల అభివృద్ధి కోసం, నిరంతరం పాటుపడాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో జరిగిన జీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పూనెంసాయి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అభివృద్ధి పథకాలు మారినా, ఏజెన్సీలోని ఆదివాసీల బ్రతుకులు మారడం లేదని, ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన ఆగడం లేదని ఆవేదన చెందారు. అంబేడ్కర్ ఇచ్చిన హక్కుతో చట్టసభలకు ఎన్నిక అవుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు గిరిజనేతరుల కొమ్ముగాస్తూ, ఆదివాసి గూడేల అభివృద్ధికి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల మాయమాటలకు ఆదివాసీలు మోసపోతూనే ఉన్నారని అన్నారు. ఏజెన్సీలోని ప్రత్యేక చట్టాల అమలుకు, ప్రభుత్వ పథకాల పంపిణీలో, ఆదివాసీల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల, 1/70, ఎల్ టి ఆర్ లాంటి ప్రత్యేక చట్టాలు నీరు గారి పోతున్నాయని, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సి వస్తుందంటే, పాలకుల, ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్య ధోరణి వళ్ళనే అని మండిపడ్డారు. పాలకులు వస్తుంటారు, పోతుంటారు, ఉద్యోగులు మాత్రం ఆత్మస్తుతి పరినిందలా వ్యవహరించ కుండా, ఆత్మ సాక్షిగా, ఆదివాసీల అభివృద్ధికి, చట్టాల అమలుకు కట్టబడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అందించిన హక్కులకోసం, మన్యం బిడ్డల అభివృద్ధి కోసం, గోండ్వానా సంక్షేమ పరిషత్ నిరంతరం విశ్రమించకుండా పోరాడుతుందని తెలిపారు.
ఈయొక్క కార్యక్రమంలో చంటి,నరేష్ తదితరులు పాల్గొన్నారు.