
పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
జర్నలిస్టుల సంక్షేమానికి కోటి విరాళం
తన జన్మదిన వేడుకల సందర్భంగా రూ. ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కు ను అందజేత అభినందించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేసే జర్నలిస్ట్ యోధులకు కూకట్ పల్లి బిజెపి సీనియర్ నాయకులు, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అండగా నిలిచారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, శాశ్వత నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. శనివారం ఆయన నివాసం వద్ద జరిగిన వడ్డేపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకల సందర్భంగా రూ. ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అందజేశారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను చూసి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ తాను చెల్లించానని ఈ సందర్భంగా తెలిపారు. తన సూచన మేరకు కూకట్పల్లిలోని సీనియర్ జర్నలిస్టులు ఏకతాటిపైకి వచ్చి కూకట్పల్లి జర్నలిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. తాను ఇస్తున్న కోటి రూపాయలను జర్నలిస్టులు శాశ్వత అవసరాలైన భూమి కొనుగోలు కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జర్నలిస్టులకు అండగా నిలిచిన వడ్డేపల్లి రాజును అభినందించారు. నాయకులకు, జర్నలిస్టులకు ఎంతో విడదీయరాని బంధం ఉంటుందని ఈరోజు వడ్డేపల్లి రాజు చేసిన పని మరింత బలోపేతం చేసిందని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు తమ సొంత కుటుంబాలను సైతం వదిలేసి ప్రజల సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుంటారని కొనియాడారు. యాజమాన్యాల నుంచి వచ్చే జీతభత్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయని అన్నారు. జర్నలిస్టులకు పెద్ద మొత్తంలో డబ్బులను అందజేసేందుకు ముందుకు వచ్చిన రాజు మనసు ఎంతో గొప్పది అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జర్నలిస్టులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, ప్రధాన కార్యదర్శి ఆర్. కె.దయాసాగర్, కోశాధికారి ఎం ఏ కరీం, సీనియర్ జర్నలిస్టులు తొట్ల పరమేష్, నిమ్మల శ్రీనివాస్, విద్యా వెంకట్, నవీన్ రెడ్డి, వేణుమాధవ్, మాణిక్య రెడ్డి, నాగరాజు, లక్ష్మణ్, హరి, దామోదర్, విష్ణు, శ్రీనివాస్ యాదవ్, రాము, కైలాష్, మహేందర్, సాగర్ రెడ్డి, ప్రవీణ్ ,రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.