
ఐటీడీఏ పీవో బి రాహుల్
పయనించే సూర్యుడు మే 22 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన గ్రామాలలోని కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పొందడానికి ఆ గ్రామంలోని గిరిజన మహిళా సోసైటీలకే పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం నాడు ఐటీడీఏ సమావేశం మందిరంలో ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న మహిళా సొసైటీలతో ఒకరోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా సొసైటీ మహిళలతో ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ భద్రాచలం పరిధిలో ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న గిరిజన మహిళలు కాంట్రాక్టర్లను, బినామీలను నమ్మి ఇసుక ర్యాంపుల నిర్వహణ వారికి అప్పగించకుండా మహిళలందరూ ఐకమత్యంగా ఉండి గోదావరిలో నుండి ఇసుక వెలికితీత మరియు నిర్వహణ బాధ్యత, ఉత్పత్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలోని ఆయా గ్రామాల పరిధిలో ఉన్న సొసైటీలు సొంతంగా ఇసుక ర్యాంపులు నిర్వహించుకోవడానికి, తద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. అంతకుముందు ఇసుక ర్యాంపుల నిర్వహణ తీరు మరియు ఎదుర్కొంటున్న సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక ర్యాంపులు నిర్వహించే మహిళలు ఆ గ్రామానికి సంబంధించిన వారే ఉండాలని, బినామీలను ఎవరిని దరిచేరకుండా చూడాలని, ఇసుక సరఫరాకు సంబంధించిన ప్రతిదీ రిజిస్టర్లో నమోదు చేయాలని ఆయన మహిళలకు సూచించారు. మహిళలు ఇసుక ర్యాంపుల పూర్తి బాధ్యత తీసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన అన్నారు.
ఇసుక ర్యాంపులు సొంతంగా నిర్వహించుకునే గిరిజన మహిళలకు సాంకేతిక సహకారం మరియు ఆర్థిక సహకారంతో పాటు మహిళలందరికీ తగిన శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక అధికారులను నియమించి వారి ద్వారా తగిన సలహాలు, సూచనలు అందించడం జరుగుతుందని అన్నారు. ఇసుక ర్యాంపుల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొని రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిసా స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్,తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్, ఏడి మైన్స్ దినేష్ కుమార్ వివిధ గ్రామాల నుండి వచ్చిన సొసైటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.