
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
నందిగామ మండలం అప్పారెడ్డి గూడలో రెవెన్యూ సదస్సు
కొత్త రెవెన్యూ చట్టం భూభారతితో సమస్యలకు చెక్
హాజరైన మండల స్థాయి అధికారులు, నాయకులు, కార్యకర్తలు
( పయనించే సూర్యుడు జూన్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా రాష్ట్రమంతటా రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందని భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఆయా గ్రామాల్లో సదస్సులకు శ్రీకారం చుడుతున్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” చెప్పారు. షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక తహసిల్దార్ రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి భూభారతి చట్టం 2025 పై అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులనీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఏడాదిలోపు భూ ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్ణయించిన సర్కార్, ప్రతి కమతానికి సరిహద్దులతో కూడిన మ్యాప్ను అందుబాటులోకి తీసుకురానుందనీ గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు సర్వేయర్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోందన్నారు. భూభారతి సదస్సులు – ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులు గ్రామాలకే వస్తున్నారని అన్నారు. అనేక సంఖ్యలో ఉన్న ధరణి సమస్యలతో పాటు ఇతర భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మేల్యే స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం భూ భారతిపై అవగాహన కల్పించడంతో పాటు పైసా ఖర్చు లేకుండా భూ సమస్యల తక్షణ పరిష్కారానికి సదస్సులు వేదిక కానున్నాయనీ వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రైతుల ప్రమేయం లేకుండానే వారు భూ సమస్యల్లో చిక్కుకున్నారని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థలో నాడు చోటుచేసుకున్న తప్పులను సరిచేసి, భూ పరిపాలనను సదస్సుల ద్వారా ప్రజల వద్దకే తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జంగా నరసింహులు యాదవ్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, జగదీశ్వరప్ప, సురేష్ రెడ్డి రవీందర్ రెడ్డి మాజీ డిప్యూటీ సర్పంచ్ సీతారాములు మాజీ వార్డు సభ్యులు గ్రామ రైతులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు..