
పయనించే సూర్యుడు జూన్ 12 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
పాఠశాల ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిపామ్స్ పంపిణీ
పాఠశాలకు ఆకర్షణీయమైన బొమ్మలతో వాల్ పెయింట్ వేయించాలి
రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్ లో మండల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం రఘునాధపాలెం మండలం పువ్వాడ నగర్ లో మండల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రతి రోజు పిల్లలు సాయంత్రం పూట కొంత సమయం చదువుకోవాలని, కొంత సమయం ఆడుకోవాలని అన్నారు. మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు.బాల్యంలో చదువు, ఆటలు, ఆరోగ్యం చాలా కీలకమని అన్నారు. ఇంటి భోజనంతో మంచి ఆరోగ్యం వస్తుందని, బయటి ఫుడ్ తినవద్దని అన్నారు. పిల్లలు తమ లక్ష్యాలను ఒక పుస్తకంలో రాసుకొని ప్రతి రోజూ గుర్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు అనంతరం సంతోషంగా పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించుకోవడం జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని అన్నారు. ప్రతి వర్గానికి చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జిల్లాలో మూతపడిన పాఠశాలలను పునః ప్రారంభిస్తున్నామని, పాఠశాలలో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ప్రతి పిల్లవాడిలో మంచి టాలెంట్ ఉంటుందని, దానిని సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వ పాఠశాలల్లో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచేలా పకడ్బందీగా కృషి చేస్తున్నామని అన్నారు. పాఠశాలలో ఏఐ టూల్స్ వినియోగించుకొని నాణ్యమైన ఆంగ్ల విద్య అందిస్తున్నామని అన్నారు.ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. గతంలో వైరా మండలం నారపనేనిపల్లిలో ఒకే విద్యార్థిని ఉన్న పాఠశాలలో 20 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారని, అక్కడ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించామని అన్నారు. ఉపాధ్యాయులు చాలా నిబద్దతతో పని చేస్తున్నారని, సమన్వయం చేసుకుంటూ పక్కాగా విద్యార్థులకు బోధన అందేలా చర్యలు చేపట్టామని అన్నారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. వంట గది, పిల్లల రూంను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. పూర్వ ప్రాథమిక పాఠశాల క్రింద అంగన్వాడీ పని చేయాలని, పిల్లలకు ఆట వస్తువులతో చిన్న, చిన్న పాఠాలు సిలబస్ ప్రకారం బోధించాలని అన్నారు. పిల్లల ఎదుగుదల నిరంతరం మానిటరింగ్ చేయాలని, పిల్లలకు రెగ్యులర్ గా పౌష్టికాహారం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ బి. పురంధర్, రఘునాధపాలెం మండల తహసిల్దారు ఎస్. శ్వేత, ఎంపిడిఓ అశోక్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి, గ్రామ కార్యదర్శి వై. రాంబాబు, ఐసిడిఎస్. సూపర్వైజర్ జి. వెంకటలక్ష్మి, అంగన్వాడి టీచర్ జి. విజయ కుమారి, అంగన్వాడి హెల్పర్ బి. శ్రావణి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

