
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
• భద్రాద్రి కొత్తగూడెం జిల్లారైలు వినియోగదారులకు సౌకర్యం మరియు సౌలభ్యం అందించడానికి శర వేగంగా కొనసాగుతున్న పనులు భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులు చేపట్టడం ద్వారా గొప్ప పరివర్తన దిశగా పురోగమిస్తుంది. ” అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” (ఏ.బి.ఎస్.ఎస్.) కింద, తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో, ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను అందించడానికి మరియు వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి పునరాభివృద్దిచేయబడుతున్నాయి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 2023 మరియు ఫిబ్రవరి, 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పధకానికి మరింత ప్రోత్సాహం లభించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని చేయడం లక్ష్యంగా పెట్టుకుని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విధానాన్ని రూపొందించింది. ఈ ఆలోచన ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరియు రైల్వే స్టేషన్ల ప్రోత్సాహాన్ని పెంచే మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ కీలక అంశాల అమలుపై ఆధారపడింది భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ గురించి సంక్షిప్త సమాచారం :
భారతదేశం వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసే లక్ష్యంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏ.బి.ఎస్.ఎస్.) కింద పునరాభివృద్ధి చేయబడుతున్న తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లలో భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఒకటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ రైల్వే స్టేషన్, భారతీయ రైల్వేల ప్రారంభ రోజుల నాటి గొప్ప చరిత్రను కలిగి ఉంది. ప్రారంభంలో, ఈ స్టేషన్ సమీపంలోని గనుల నుండి నిజాం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బొగ్గును రవాణా చేయడానికి నిర్మించబడింది. కాలక్రమేణా, ఇది హైదరాబాద్, విజయవాడ, వరంగల్ మరియు ఇతర ప్రధాన నగరాలను కలుపుతూ కీలకమైన రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ స్టేషన్ ప్రముఖంగా భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి ప్రవేశ ద్వారంగా ఉంటూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ స్టేషన్ భద్రాచలం ఆలయ పట్టణానికి సమీపంలో ఉండటం వలన భక్తులు మరియు ప్రయాణికులకు ఇది ఎంతో అనువుగా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, ఈ స్టేషన్ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో భాగంగా విద్యుదీకరణ మరియు భద్రాచలం రోడ్ – సత్తుపల్లి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం ఉన్నాయి. ఈ కొత్త రైల్వే లైన్ ను దక్షిణ మధ్య రైల్వే మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తద్వారా బొగ్గు రవాణాను సులభతరం చేయడం మరియు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సుమారు రూ.25.41 కోట్ల అంచనా వ్యయంతో వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్, లిఫ్ట్ మరియు మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలతో సహా ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో మరింత పునరాభివృద్ధి చేయబడుతూ ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్గా నిలువనుంది. • నాన్-సబర్బన్ గ్రేడ్-4 ఎన్.ఎస్.జి-4)గా వర్గీకరించబడిన భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. • డోర్నకల్-మణుగూరు సెక్షన్లో నున్న ఈ స్టేషన్ రూ 7.61 కోట్ల వార్షిక ఆదాయంతో సగటున రోజుకు 8020 మంది ప్రయాణీకుల రాకపోకలతో ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది. • భద్రాచలం రోడ్ స్టేషన్లో 3 జతల రైళ్లు బయలుదేరుతాయి/ముగిస్తాయి మరియు 2 రైళ్లు ఆగుతాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రణాళిక చేయబడిన పనులు : స్టేషన్ భవనం ముఖద్వారం అభివృద్ధి. ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం ఏర్పాటు. ప్రయాణీకుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదాచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంతో పాటు 01 లిఫ్టు & 01 ఎస్కలేటర్ ఏర్పాటు. ప్లాట్ఫామ్ ఉపరితల మెరుగుదలలు. ప్లాట్ఫారమ్పై అదనపు కప్పు ఏర్పాటు.
ఇప్పటికే ఉన్న టాయిలెట్లకు మెరుగుదలలు, దివ్యాంగుల సౌకర్యాలతో సహా కొత్త టాయిలెట్ బ్లాకుల నిర్మాణం. వెయిటింగ్ హాల్ అభివృద్ధి.
స్టేషన్ వినియోగదారులకు ఆహ్లాదకరమైన ప్రాకృతిక అనుభవాన్ని అందించడానికి స్టేషను ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం, ట్రాఫిక్ సజావుగా సాగడానికి స్టేషన్ ప్రాంగణం మెరుగుదల. స్టేషన్ ప్రాంతాలలో కళలు మరియు సంస్కృతి చిత్రీకరణ. ప్రయాణీకులకు అనుకూలమైన సంకేతాలు, రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు మొదలైనవి. ఇప్పటివరకు మొత్తం 45 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. అన్ని పనులు ఏకకాలంలో పురోగతిలో ఉన్నాయి మరియు రాబోయే కొన్ని నెలలలో పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించారు.