
నాణ్యమైన విద్యను పొందుదాం
టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు పిలుపు
పయనించే సూర్యుడు జూన్ 02పొనకంటి ఉపేందర్ రావు
ఇల్లందు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జాతా ఇల్లందు కేంద్రం లో కొత్త బస్టాండ్ సెంటర్, గోవింద్ సెంటర్, సుభాష్ నగర్, జగదాంబ సెంటర్, పాత బస్టాండ్, కొమరారం తదితర ప్రాంతాల్లో కరపత్రాలను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా వారు తల్లిదండ్రులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు , ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని, విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని తెలియజేశారు. ఈ ఈ కార్యక్రమంలో
రాష్ట్ర కార్యదర్శి బి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు వి వరలక్ష్మి,జిల్లా కార్యదర్శి ఇ.హథీరాం,పి. జయరాజు, ఇల్లందు మండల అధ్యక్షులు ఏ. రాంబాబు, ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, కార్యదర్శి జె శ్రీను,కె శేషగిరి, సీనియర్ సభ్యులు రాజమణి, తదితరులు పాల్గొన్నారు.