
పయనించే సూర్యుడు జూన్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స జరుగుతుండడంతో ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పరామర్శించారు. ఆత్మకూరు పర్యటనలో భాగంగా గండ్లవీడు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాద సమాచారం తెలుసుకున్న విక్రమ్ రెడ్డి వెంటనే జిల్లా వైద్యశాలకు వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. ఆర్డీఓ పావని, జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ శేషారత్నం, వైద్యసిబ్బందితో రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం బాధాకరమని, గాయపడిన బాధితులకు ఏమైనా అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. నెల్లూరు-ముంబాయి జాతీయ రహదారి అధికారులు ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వారితో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.