
పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి చట్టం లను సమర్థవంతంగా అమలు పరచాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపిక, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన, భూభారతి చట్టం, జలసంచై జన్ భాగి దారి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు మరియు పాము పౌండ్స్ నిర్మాణం మరియు త్రాగునీటి సమస్యల పరిష్కారం పై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లకు గాను ఇప్పటికే మొదటి విడతలో మండలానికి ఒక గ్రామపంచాయతీ ఎంపిక చేసి ఉన్నారని మిగిలిన గ్రామపంచాయతీలలో లబ్ధిదారుల అర్హుల జాబితా క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తమ వద్దకు వచ్చిన జాబితాను సంబంధిత మండలాల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్ల కు అందజేసి వారు స్థానికంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు మరియు పంచాయతీ సెక్రటరీల తో సమన్వయం పరచుకొని ఉన్న జాబితాలో పేదల్లో నిరుపేద వారిని గుర్తించి అర్హుల జాబితా రూపొందించాలన్నారు. జాబితాలో పేరు లేని ఎవరైనా నిరుపేదలు ఉంటే వారి పేర్లు కూడా జత పరిచి అర్హుల జాబితా తయారు చేసి స్థానిక శాసనసభ్యులు సహకారంతో జాబితా రూపొందించాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకం లో భాగంగా వచ్చిన దరఖాస్తులన్నీ త్వరితగతిన పరిశీలన చేపట్టి అర్హుల జాబితా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను ఆయా కార్పొరేషన్ల వారీగా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లతో కలిసి పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని అన్నారు. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న వారికి వ్యవసాయ ఆధారిత యూనిట్లు స్థాపన చేసేలా అవగాహన కల్పించాలన్నారు. భూమి ఉన్నవారికి ఆయిల్ పంపు, పందుల పెంపకం, పాడి పరిశ్రమ, పవర్ లోడర్ వంటివి భూమి లేని వారికి చేపల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, పిండి మిల్లు వంటి యూనిట్లు స్థాపించడం ద్వారా వారికి లాభదాయకంగా ఉంటుందని తెలియచెప్పాలన్నారు. జల్ సెంచెయ్ జన్ భాగీ దారి కార్యక్రమం లో భాగంగా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్స్ నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేపట్టిన నిర్మాణాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి జిల్లాలో అమలులో భాగంగా రెవెన్యూ రికార్డులను సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. నాన్ డిఎస్ కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ భూ సమస్యల దరఖాస్తులను నివేదిక అందించాలని ఆదేశించారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు తమ పరిధిలో ఉన్నటువంటి రేషన్ కార్డ్ దరఖాస్తులు పరిశీలన మరియు ఎన్నికల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిని పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా త్రాగునీటి సమస్య ల పరిష్కారానికి కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. పైప్ లైన్ లో లీకేజీ మరియు పంపుల మరమ్మత్తులు ప్రాతిపదిక మీద పూర్తిచేయాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరా లో ఇబ్బందులు ఉన్నచోట ట్యాంకర్లు తో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా సరఫరా చేయాలనే ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తిన వెంటనే మిషన్ భగీరథ అధికారులు దృష్టికి తీసుకురావాలని వాటిని తక్షణమే వారు పరిష్కరించాలని ఆదేశించారు.