
అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలి
పయనించే సూర్యుడు జూన్ 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, భవిష్యత్ తరాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 ఆత్మకూరు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, జర్నలిస్టులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు విజన్ యాక్షన్ ప్లాన్లో ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు.
తొలుతరెవెన్యూ,మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్బి,ఆర్డబ్ల్యుఎస్, ఇరిగేషన్, విద్యుత్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు రానున్న ఐదేళ్లలో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టనున్న స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం, పరిశ్రమల స్థాపనతో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, పి`4 వంటి పదిసూత్రాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన గొప్ప ఆలోచనే స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ అని విజన్ప్లాన్ ముఖ్య ఉద్దేశాన్ని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి నుంచి వార్డు కార్పొరేటర్ వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి కిందిస్థాయి అధికారి వరకు ప్రజలందరూ ప్రతిఒక్కరూ కూడా తమ ఆలోచనలను ఈ విజన్ ప్లాన్లో పొందుపరచాలని, ప్రతిఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మనం శాశ్వతం కాదని. భవిష్యత్ తరాల కోసం మనం చేసే ఈ ప్రయత్నం శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్తో సమానంగా భావించాలని అధికారులకు ఉద్బోధించారు. మన నియోజకవర్గంలో అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని, ఇటీవల ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారని, బాలికల విద్యాభివృద్ధికి అనేక విద్యాలయాలు వచ్చాయని, త్వరలోనే ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు కానున్నట్లు మంత్రి చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గానికి ఆత్మకూర్ ఆర్డీవోను నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించిందని, ఆమెతోపాటు కొంతమంది యువ అధికారుల టీం కూడా ఈ ప్లాన్ రూపకల్పంలో కీలకంగా పనిచేస్తుందని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా తయారుచేసి భవిష్యత్ తరాల అభివృద్ధికి బంగారు బాటలు వేయాలని అధికారులకు సూచించారు. ఈనెల 12 నుంచి తల్లి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నామని, అన్నదాత సుఖీభవ పథకం రైతులకు 20,000 కూడా అందిస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరమణమ్మ, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, ఆత్మకూరు ఆర్డీవో పావని, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, సోమశిల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కేశవచౌదరి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రఘురామయ్య, ఆర్అండ్బి, పిఆర్, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈలు గంగాధర్, అశోక్కుమార్, వెంకటరమణ, పలువురు ఇంజనీరింగ్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడీవోలు, పలు శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
