
రైతులకు అవగాహన సదస్సులో పాల్గొన్న
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐ టి డి ఏ పి ఓ రాహుల్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 పొనకంటి ఉపేందర్ రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వం భూభారతిని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం నాడు భద్రాచలం పట్టణంలోని రైతు వేదికలో భూభారతి పోర్టల్ అమలులో భాగంగా భూభారతి చట్టం -2025 అవగాహన కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు,ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ మరియు శిక్షణ కలెక్టర్ శర్మతో కలిసి భూభారతి చట్టం అమలుపై రైతుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిదని, భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించే వారని, నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ (ఏ ) ను ఏర్పాటు చేసి భూమి విలువ ఐదు లక్షలు లోపు ఉన్న పక్షంలో ఆర్డీవో స్థాయి, ఐదు లక్షల పై గా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. భూమి విషయంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ఆ రోజు నుండి సంవత్సరకాలంలోపు సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ స్థాయిలో సమస్యను పరిష్కారం కానిపక్షంలో సి సి ఎల్ ఏ కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం మండల తాసిల్దార్లు, సబ్ రిజిస్టర్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని, ఇకనుండి చేసే రిజిస్ట్రేషన్ లను అన్ని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన భూ భారతిలో వాటిని సరి చేసిందన్నారు. భూ భారతిలో రెవెన్యూ రికార్డులను సరిగ్గా మెయింటెన్ చేస్తారని, ప్రతి సంవత్సరం భూముల రికార్డుల ను తీసి ఆ ఫైళ్లను తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరు స్తామన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న భూభారతిలో సైతం ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లవచ్చని, అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చని, అక్కడ కూడా న్యాయం జరక్కపోతే కలెక్టర్కు అప్పీలు చేసుకునే అవకాశం భూభారతిలో ఉందని అన్నారు. అనంతరం భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన భూభారతి చట్టం-2025 ప్రకారము భూమి హక్కులు మరియు భూ సమస్యల సత్వర పరిష్కారం జరగడానికి అవకాశం ఉందని, మారుమూల ప్రాంత గిరిజన రైతులు మీ యొక్క భూ సమస్యలను ఈ భూభారతి చట్టం ద్వారా శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చని రైతులకు సూచించారు. తప్పనిసరిగా మారుమూల ప్రాంత గిరిజన రైతులు ఈ భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు సంబంధిత రెవెన్యూ అధికారులను కలిసి పరిష్కరించుకోవాలని, భూ సమస్యల విషయంలో అధికారులు ఎవరైనా సహకరించకపోతే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ, నా దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. ఈ అవగాహన సదస్సులో భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, తాసిల్దార్ శ్రీనివాసరావు, రైతులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.