Sunday, June 8, 2025
Homeతెలంగాణపోడు ''పంటలకు ప్రాణం''

పోడు ”పంటలకు ప్రాణం”

Listen to this article

పోడు పట్టా భూములకు విద్యుత్ సౌకర్యం

విద్యుత్ శాఖ సర్వే

సస్యశ్యామలంగా మారనున్న బీడు భూములు

కొండ రెడ్ల గ్రామాల్లో ప్రయోగాత్మకం

ఫలిస్తున్న ఐటీడీఏ పీవో రాహుల్ చర్యలు

గిరిజన రైతాంగం హర్షాతిరేకాలు

పయనించే సూర్యుడు జూన్ 07 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొండ కోనలే ఆవాసంగా…అడవి తల్లి ఒడి బడిగా…తరతరాల సంప్రదాయానికి పెట్టింది పేరైన అడవి బిడ్డల కల త్వరలో సాకారం కాబోతోంది. తమ జీవన విధానంలో ప్రధాన భాగం వ్యవసాయ ప్రగతికి భద్రాచలం ఐటీడీఏ అండగా నిలబడింది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా గిరిజన అటవీ పోడు భూములకు పట్టాలివ్వటమే కాదు..ఆ భూములను సస్యశ్యామలంగా మార్చేందుకు ఐటిడిఏ పిఓ బి. రాహుల్ ఐఏఎస్ నడుం బిగించారు. గిరిజన విద్య, వైద్య, సాంస్కృతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఇప్పటికే ” గిరిజన బాంధవుడి”గా చక్కని పేరు తెచ్చుకున్న పిఓ రాహుల్ మరో వినూత్నమైన సహాయానికి శ్రీకారం చుట్టారు. మారుమూల అటవీ పల్లెల్లో నివాసముంటున్న కొండ రెడ్ల జీవితాల్లో వెలుగులు నింపటానికి వారికి ప్రభుత్వం కేటాయించిన అటవీ పోడు పట్టా భూములకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలకు ఉపక్రమించారు. పట్టా పోడు బీడు భూములను పంట భూములుగా సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు విద్యుత్ సౌకర్యం కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దీంతో అతి త్వరలోనే అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లోని పలు కొండారెడ్డి ఆవాస ప్రాంతాల్లో పోడు భూములు విద్యుత్ సౌకర్యానికి నోచుకోనున్నాయి. పిఓ రాహుల్ దూరదృష్టి గిరిజన రైతాంగానికి వరంగా మారింది పోడు పట్టా భూములకు విద్యుత్ సౌకర్యం తరతరాలుగా గిరిజన రైతాంగం పోరాడి తాము ఇప్పటికే సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం నుంచి పట్టాలు పొందారు. కేవలం ఈ భూముల్లో ఆకాశవాయి పంటలు మాత్రమే పండుతున్నాయి. అతివృష్టి, అనావృష్టితో ప్రతి ఏటా పోడు పట్టా భూముల్లో పంటలు గిరిజన రైతాంగం నోటికి రాకుండానే పాడైపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ గిరిజన పోడు పట్టా భూములు బీడు భూములను సస్యశ్యామలంగా మార్చే పనిలో పడ్డారు. ఈ సమస్యపై ఐటిడిఏ పీఓ వ్యవసాయ శాఖ అధికారులతో పలుమార్లు ముచ్చటించారు. విద్యుత్ శాఖ తో కూడా సంప్రదింపులు జరిపారు. ఆయా భూములకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తే మోటార్ల ద్వారా గిరిజన రైతాంగం పట్టా పోడు బీడు భూములను పంట భూములుగా మార్చేందుకు వీలు కలుగుతుందని తద్వారా గిరిజన రైతాంగం అభివృద్ధి బాట పడుతుందని భావించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి కూడా నివేదించారు. గిరిజన తెగల్లో కొండలు,గుట్టలకే పరిమితమైన కొండరెడ్ల పోడు పట్టా భూములకు ప్రధానంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపడంతో సానుకూలంగా అనుమతులు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఐటీడీఏలో కూడా పోడు భూముల్లో విద్యుత్ సౌకర్యంకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అది కేవలం భద్రాచలం ఐటీడీఏకే దక్కటం గమనార్హం. గిరిజన రైతుల పోడు పట్టా భూముల్లో విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు అటవీశాఖ అడ్డంకులు లేకుండా పిఓ రాహుల్ ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. కొండరెడ్ల గ్రామాల్లో ప్రయోగాత్మకం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అశ్వరావుపేట మండలం వినాయకపురం కొండరెడ్ల ప్రాంతాల్లో 5.975 హెక్టార్ల పోడు భూములు త్వరలో విద్యుత్ సౌకర్యానికి నోచుకోనున్నాయి. ఇక్కడ దాదాపు 37 మంది కొండ రెడ్ల రైతుల పోడు పట్టా భూములకు మేలు చేకూరనుంది. అదేవిధంగా దమ్మపేట మండలం గురువాయుగుండంలో 0.375 హెక్టర్ల పోడు పట్టా భూములకు విద్యుత్ సౌకర్యం ఏర్పరచనున్నారు. 8 మంది కొండ రెడ్ల రైతులకు ప్రయోజనం చేకూరనుంది.ఆయా పోడు పట్టా భూములకు ఇప్పటికే ఫారెస్ట్ అనుమతులు వచ్చి ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్ శాఖ సర్వే కొనసాగుతోంది. ఎటువంటి రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా ఆయా పోడు పట్టా భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించే సర్వే పనులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే గిరిజన కొండరెడ్ల రైతాంగానికి పెద్ద ఎత్తున మేలు జరగనుంది. పోడు పట్టా భూములు సస్యశ్యామల భూములుగా కళకళలాడునున్నాయి. భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఐఏఎస్ చూపిస్తున్న చొరవపట్ల గిరిజన రైతాంగం హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments