
పయనించే సూర్యుడు జులై 02 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆధార్ కార్డులో అవసరమైన వివరాల సవరణలు చేసుకునేందుకు ప్రత్యేకంగా మేగా ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు . జూలై 9 మరియు 10 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం, నవభారత్, పాల్వంచలో ఈ క్యాంపులు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆధార్ కార్డులో తప్పులున్న వారు, కొత్త సమాచారం జత చేయాలనుకునే వారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ ఆధార్ క్యాంపులో పలు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు . వాటిలో పేరు మార్పు లేదా సవరణ, పుట్టిన తేది సవరణ, లింగం మార్పు, చిరునామా సవరణ, మొబైల్ నంబర్ అప్డేట్, ఫోటో అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్, తల్లిదండ్రుల పేర్లను జోడించడం వంటి సేవలు ఉన్నాయి అని తెలిపారు . ప్రత్యేకంగా 5 మరియు 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు తప్పనిసరిగా నవీకరించాల్సి ఉంటుందన్నారు. అలాగే 0-5 ఏళ్ల పిల్లల ఆధార్లో తల్లిదండ్రుల పేర్లను జతచేసే అవకాశం కూడా ఈ క్యాంపులో కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.కొన్ని వివరాలు ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయవచ్చు, మరికొన్ని మాత్రం ఆధార్ సేవా కేంద్రం నుంచే చేయాల్సి ఉంటుందని, ఉదాహరణకు, చిరునామా మార్పు ఆన్లైన్లో సాధ్యపడుతుంది కానీ మొబైల్ నంబర్ లేదా పుట్టిన తేది సవరణ వంటి సేవలు కేవలం ఆధార్ సేవా కేంద్రాల్లోనే చేయాలి. కొన్ని సవరణలకు జీవితంలో ఒక్కసారే అవకాశం ఉంటుందని అయన స్పష్టం చేశారు.కావున ఆధార్ డేటాలో ఏవైనా సవరణలు చేయించుకోవాలనుకుంటున్న జిల్లావాసులు తప్పక ఈ మేగా ఆధార్ క్యాంపులను సందర్శించాలని, తమ వివరాలను నవీకరణ చేసుకోవాలని కలెక్టర్ కోరారు.