
వైద్య సమస్యలను పరిష్కరించాలి ప్రైవేటు వైద్య దోపిడిని నివారించాలి
ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి మోకాళ్ళ రమేష్ కోలా లక్ష్మీనారాయణ
పయనించే సూర్యుడు జులై 12 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి:ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ అధ్యక్షతన టేకులపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మోకాళ్ళ రమేష్, కోలా లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున గ్రామీణ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందన్నారు. వెంటనే సీజనల్ వ్యాధులను అరికట్టే చర్యలను ప్రభుత్వం చేపట్టాలన్నారు. గ్రామాలలో పంచాయితీ పాలకవర్గాలు లేకపోవడం మూలంగా పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. వెంటనే గ్రామాలలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని, బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పిచికారి చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అనేకమంది ఆదివాసీలు, గిరిజనులు, అమాయక పేద ప్రజలు విష జ్వరాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. విపరీతంగా దోమలు వ్యాప్తి చెంది రకరకాల జబ్బులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. వెంటనే దోమతెరలను పంపిణీ చేయాలన్నారు. గ్రామాలలో పల్లె దవాఖానాలు మొదలుకొని మండలాలలో పీ హెచ్ సీ సెంటర్లు అనేక సమస్యలతో నడుస్తున్నాయన్నారు. మండల కేంద్రాలలో 24 గంటల వైద్య సదుపాయం కల్పించాలన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచి అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం మూలంగా ప్రజలు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్తున్నారన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో విపరీతమైన బిల్లులు వేసి ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారన్నారు. వైద్య రంగ సమస్యలు పరిష్కరించే వరకు ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) దశల వారి ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.*ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పర్శిక రవి, ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ , జిల్లా సహాయ కార్యదర్శి వాంకుడోత్ మోతిలాల్, తోటకూరి సతీష్ , అటికం శేఖర్, రావూరి ఉపేందర్, జోగకృష్ణ, తాటి రమేష్, కొడెం రవి, మోకాళ్ళ శేఖర్ తదితరులు పాల్గొన్నారు