
పయనించే సూర్యుడు జూన్ 23 (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లారైతు భరోసాలో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా 9000 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ప్రభుత్వం సచివాలయం వద్ద నిర్వహించే రైతు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని జిల్లాలో ని రైతు వేదికల నుండి రైతులు ప్రత్యక్షంగా వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 58 రైతువేదికలలో రైతు సదస్సులు ప్రత్యక్షంగా వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మంగళవారం అన్ని రైతు వేదికలను పండుగ వాతావరణం లో మామిడి తోరణాలు, రంగవల్లులతో అలంకరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నాలుగు గంటలకే రైతు వేదిక వద్దకు రైతులు చేరుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆడియో మరియు వీడియోలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా సరిచూసుకోవాలన్నారు. రైతు వేదికలకు విచ్చేసే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున హాజరు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపాలని అధికారులకు సూచించారు. ప్రతి రైతు వేదికలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మరియు మండల స్థాయిలో ఎంత మంది రైతులకు ఎంత మొత్తంలో రైతు భరోసా జమ అయినదో వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి రైతు వేదిక వద్ద పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు వేదికల వద్ద హాజరైన రైతుల వివరాలను నమోదు చేసి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.