
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు
ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా పట్టిష్ట చర్యలు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 6వ డివిజన్ లో సీసీ రోడ్డు, డ్రైయిన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
పైనుంచి సూర్యుడు సెప్టెంబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో విలీనమైన గ్రామాలలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంత్రివర్యులు, మంగళవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధి 6వ డివిజన్ లో పర్యటించి మునిసిపల్ నిధులు కోటి 46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ నగర కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాలలో ఇండ్ల నిర్మాణం త్వరితగతిన జరుగుతుందని, దీనికి అనుగుణంగా కొత్త రోడ్లు, డ్రైయిన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. 6వ డివిజన్ పరిధిలో పూర్తి స్థాయిలో రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అన్నారు.నగరంలో ఖాళీ స్థలాల యజమానులు బాధ్యత తీసుకొని వారి స్థలం నుంచి దుర్వాసన, దోమలు రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా భూమి లెవెలింగ్ చేయాలని, లేని పక్షంలో కార్పొరేషన్ తరపున చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.ప్రతి ఇంటిలో ఇంకుడుగుంతల నిర్మాణం చేసుకోవాలని తద్వారా భూగర్భ జలాలు పెరిగి, వేసవి కాలంలో మనకు ఉపయోగపడతాయని అన్నారు. మన ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు.
నగరంలో జరిగే నూతన నిర్మాణాలను ప్రారంభ దశలోనే సక్రమంగా ఉన్నాయో లేవో టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించాలని, రోడ్లను ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ జరిగే నిర్మాణాలకు ప్రారంభ దశలోనే అడ్డుకట్ట వేయాలని మంత్రి ఆదేశించారు.అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ నగరంలో ప్రజల ప్రయాణానికి సిసి రోడ్లు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని, ప్రజలకు భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అపార్ట్మెంట్ల నిర్మాణసమయంలో తప్పనిసరిగా వాన నీటినీ ఒడిసి పట్టుకునే విధంగా సంపు, ట్యాంక్ లు నిర్మించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, 6వ డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబు, మునిసిపల్ కార్పొరేషన్ ఇఇ కృష్ణలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
