
పయనించే సూర్యుడు// న్యూస్ జూన్15//
మక్తల్ : త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త క్రమశిక్షణ కలిగిన సైనికుడి వలె ముందుకు సాగాలని బిజెపి మక్తల్ అసెంబ్లీ కన్వీనర్ కర్ని స్వామి, మాజీ ఎంపిటిసి జి. బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. మక్తల్ మండలంలోని సంగం బండ లో శనివారం మక్తల్ రూరల్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ రూరల్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో బూత్ లెవెల్ నుంచి మండల, జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. గత 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించి వారిని పార్టీ వైపు ఆకర్షితులను చేయాలని అన్నారు. మోదీ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ చారిత్రాత్మకమైన అంశం అని అన్నారు. మక్తల్ రూరల్ మండల అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన ఉపాధ్యక్షులుగా కటికెలి లింగప్ప(కర్ని), వై.పల్లవి(సంగం బండ), బోయ రవి (గుడిగండ్ల), మహాదేవమ్మ (రుద్ర సముద్రం), ప్రధాన కార్యదర్శులుగా రాజు( మాధ్వార్), జనార్ధన్ (గొల్లపల్లి) తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జి. ప్రసన్న బలరాంరెడ్డి, చీరాల సత్యనారాయణ, నాయకులు జయానంద్ రెడ్డి, లింగంపల్లి నరేష్, వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.
