
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 10:- రిపోర్టర్ ( కే. శివకృష్ణ )ఒడిశా రైల్వే అధికారులు, పాలకులు కేంద్రంపై ఒత్తిడి చేసి (కేకే లైన్) రాయగడ డివిజన్లో చేర్పించేసుకున్నారు. కనుక ఆ ఆదాయంలో విశాఖ రైల్వే జోన్కి వాటా లభించే అవకాశం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కూడా ఒకటి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా మారడం, సిఎం చంద్రబాబు నాయుడు, ఇద్దరు కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు ఒత్తిళ్ళ కారణంగా ఎట్టకేలకు రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళ తర్వాత విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతోంది.దీని కోసం విశాఖలో రూ.111 కోట్లు వ్యయంతో విశాఖలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించేందుకు ఇటీవలే ప్రధాని మోడీ శంకుస్థాపన కూడా చేశారుకానీ ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు రైల్వేజోన్ ఏర్పాటుకి కేంద్రం అంగీకరించినప్పటికీ విశాఖ రైల్వే జోన్కి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వాటిని నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు నష్టం జరగకుండా కాపాడుకోవలసి వస్తోంది.విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినా దానిలో వాల్తేర్ డివిజన్ ఏర్పాటు చేయలేదని గమనించిన సిఎం చంద్రబాబు నాయుడు బృందం మళ్ళీ దాని కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడంతో, విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ అంగీకరించిఅటు నౌపాడ, పలాస, పర్లాకిమిడి నుంచి బొబ్బిలి, సాలూరు, విజయనగరం, దువ్వాడ, జగ్గయ్యపాలెం సెక్షన్స్ కలిపి మొత్తం 410 కిమీలను విశాఖ డివిజన్ పరిధిలోకి చేర్చింది.కానీ సిఎం చంద్రబాబు నాయుడు బృందం ఎంత ఒత్తిడి చేసినా విశాఖ రైల్వే జోన్కి ఏటా రూ.10,000 కోట్లు ఆదాయం తెచ్చిపెట్టగల బచేలి-కిరండల్ (కేకే లైన్) రాయగడ డివిజన్కి కేటాయించేసింది.ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి విశాఖ పోర్టు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిత్యం వేల టన్నుల బొగ్గు, ఇనుప ఖనిజం రైల్వే వేగన్ల ద్వారా వస్తుంది. ఈ ముడి సరుకు తరలింపు ద్వారా వచ్చే ఆదాయం మొత్తం భువనేశ్వర్లోని దక్షిణ కోస్తా రైల్వే జోనుకి దక్కేది.ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తునందున దానిలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒడిశా రైల్వే అధికారులు, పాలకులు కేంద్రంపై ఒత్తిడి చేసి (కేకే లైన్) రాయగడ డివిజన్లో చేర్పించేసుకున్నారు. కనుక ఆ ఆదాయంలో విశాఖ రైల్వే జోన్కి వాటా లభించే అవకాశం లేకుండా పోయింది.విశాఖకు ముడిసరుకు తరలిస్తున్నపుడు దానిలో విశాఖ రైల్వే జోన్కి వాటా ఇవ్వకపోవడం చాలా బాధాకరమే. దీని కోసం కూడా సిఎం చంద్రబాబు నాయుడు బృందం మరో పోరాటం చేయక తప్పదు. కానీ ప్రస్తుతం ఒడిశాలో బీజేపి అధికారంలో ఉంది కనుక ఆయన ప్రయత్నించినా ఫలించకపోవచ్చు.