ఆక్రమణలతో కుచించుకుపోయిన వీధులు.
రథోత్సవానికి అడుగడునా అడ్డంకులు

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 21 : ఆక్రమణలతో యాడికి వీధులు కుచించుకుపోయాయి. ఒకరు అడుగు ముందుకు వచ్చి కడితే తానేమీ తక్కువా అన్నట్లు మరొకరు ఇదే రీతిలో కడుతున్నారు. దింతో యాడికిలో ఏ వీధి చూసినా ఆక్రమణలతో నిండిపోయాయి. కట్టడాలను నివారించుటలో పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా మీనమేషాలు వేస్తున్నారు. 30 అడుగుల రోడ్లు నేడు 10 కి చేరుకున్నాయి. కొందరు ఏకంగా మురికి కాలువలను సైతం వదల్లేదు. మురుగు పారెందుకు అడ్డంకిగా ఉన్న కారణంగా మురికి నీళ్లు రోడ్లపై పారుతున్నాయి. వాహనాలు, పాదచారులు నడవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. అధిక శాతం మెయిన్ రోడ్డు, ఆర్యవైశ్య వీధి, రాఘవేంద్ర కాలనీ, లాలేప్ప తోట, టీచర్స్ కాలనీ తదితర వీధులు ఆక్రమణల నిలయలుగా మారాయి. రథోత్సవానికి అడ్డంకులు యాడికిలో అశేష జనవాహిని, భక్తుల నడుమ శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రథోత్సవం యాడికిలో పలు వీధులు వెంబడి లాగుతారు. అయితే ఆక్రమణలతో ఇళ్ళన్నీ ముందుకు రావడంతో రథోత్సవానికి అడ్డంకిగా ఉన్నాయి. రథానికి తెడ్లు వేయడానికి ఆయకట్టు దారులు తీవ్ర ప్రయసాలకు గురి కావాల్సి వస్తోంది. పలు మార్లు తెరు ఇరుక్కున్న సందర్భాలు చోటుచేసుకున్నాయి. ఆ పరిస్థితులో భక్తులు, అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇకపై అయినా రథోత్సవం సవ్యంగా సాగడానికి అడ్డంకిగా ఉన్న అక్రమం కట్టడాలపై పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.