ఇటుక బట్టి కార్మికుల మరియు వారి పిల్లల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు
(పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పాత బూర్గుల గ్రామపంచాయతీ పరిధిలోని ఇటుక బట్టీ కార్మికులు మరియు వారి పిల్లల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. రాఘవేంద్ర మరియు డాక్టర్ జయప్రకాశ్ పాల్గొని వైద్య సేవలు అందించారు.ఈ ఆరోగ్య శిబిరంలో బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రెడ్యా నాయక్, రాఘశ్రీ, వెంకటముని సేవలు అందించారు. అలాగే ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు శంకర్, మురళీకృష్ణ, జగదీష్, శ్రీకాంత్, ప్రగతి, లావణ్య, శ్రుతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ నీలా మరియు ఆశా వర్కర్ రాధిక కూడా సహకారం అందించారు. వాలంటీర్లు వెన్నెల, భవాని కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 182 మంది ఇటుక బట్టి కార్మికుల కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందుల పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సూచనలు ఇవ్వడం జరిగింది. అదనంగా, పల్లీ పట్టీలు (పోషకాహార పదార్థాలు) కూడా పంపిణీ చేయడం జరిగింది.ప్రగతి వెల్ఫేర్ సొసైటీ విద్య మరియు ఆరోగ్యంపై, ముఖ్యంగా జీరో మాల్న్యూట్రిషన్ (పోషకాహార లోపం నివారణ) అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. పిల్లలలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడం, విద్య ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులకు ఆరోగ్య, విద్యా సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ శిబిరం విజయవంతంగా పూర్తయ్యింది.