కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
పయనించే సూర్యుడు డిసెంబర్ 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బుధవారం జిల్లా కేంద్రానికి సంతకాల సేకరణ ప్రతులు
మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని, ప్రజల మద్దతుతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య అందించాలనే మహోన్నత సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్దం చేశారని, వాటిలో 7 కళాశాలలు పూర్తి కాగా మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వ వైద్యశాలలు పూర్తయితే ఆ ప్రాంతంలో వైద్యంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీటిని పీపీపీ విధానంలో ప్రైవేటికరణ చేసి తమ వాళ్లకు దోచి పెట్టాలని చూస్తోందని, ప్రైవేటికరణ చేస్తే వైద్య విద్యార్థులపై ఫీజుల భారంతో పాటు పేదలకు వైద్యం కూడా అందుబాటులోకి రాదని, దీని వల్ల అన్ని విధాలుగా నష్టపోతామని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుండి పూర్తిస్థాయి మద్దతు లభించిందని, దీంతో కోటి సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గంలో విజయవంతమైందని పేర్కొన్నారు.పార్టీ ఆదేశాల మేరకు బుధవారం 10వతేది నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు నుండి జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రత్యేక వాహనం ద్వారా పంపే ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసిన ముమ్మరంగా చేపట్టి విజయవంతం చేసిన నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.అదే విధంగా ఈ నెల 15వ తేది జిల్లా కేంద్రంలో భారీ ర్యాలిలు నిర్వహించి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాల నుంచి కేంద్ర కార్యాలయానికి పంపించే, కార్యక్రమం జరుగుతుందని, జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు