ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
పయనించె సూర్యుడు మార్చి 6(పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాది కొత్తగూడెం :అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు . శుక్రవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలకు కేటాయించిన పనులను సమగ్ర ప్రణాళికతో అమలు చేసి లక్ష్యాలను సాధించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, వైద్య ఆరోగ్య సేవల విస్తరణ, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు, అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమం తదితర కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా కోతులు, వీధి కుక్కల సమస్యలను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను ఆదేశించారు. ఈ సమస్యల పరిష్కారానికి 24 గంటల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ టాక్స్ వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు. రహదారుల భద్రతను మెరుగుపరచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందించే భోజన వసతులపై కూడా అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై ప్రతిరోజూ నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు యూరియా ఎరువుల సమర్థ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు బాల్య వివాహాలు బ్రతుకు ఆగం కార్యక్రమం కింద విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు.మహిళా సాధికారత దిశగా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, మొక్కలు నాటడం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరు, ప్రతి మహిళను స్వయం సహాయక సంఘ సభ్యురాలిగా చేర్చే కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు.ఈకార్యక్రమాలన్నింటినీసమర్థవంతంగా అమలు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమాల అమలును జిల్లా స్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తామని, అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పాల్గొని ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు.