శబరిమల యాత్రికులకు పసందైన భోజనం.మారిన మెనూ
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు టిడిబి శుభవార్త అందించింది. ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న వెజ్ పులావ్ , సాంబార్ స్థానంలో ఇకపై అప్పడాలు , పాయసంతో కూడిన పూర్తిస్థాయి కేరళ సంప్రదాయ భోజనం (సద్య) వడ్డించనున్నట్లు తెలిపింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడు కె. జయకుమార్ ఈ వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ, “ఇది దేవస్వం బోర్డు డబ్బు కాదు. తోటి భక్తులకు ఉత్తమమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో భక్తులు సమర్పించిన విరాళాలు. అందుకే నాణ్యమైన పదార్థాలతో సంప్రదాయ కేరళ సద్యను అందించాలని నిర్ణయించాం” అని వివరించారు. ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. పంబలో కూడా అన్నదానం సేవలను మెరుగుపరుస్తామని, యాత్రికుల సౌకర్యార్థం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నామని అన్నారు. దీనిపై డిసెంబర్ 18న సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం మండల మకరవిళక్కు సీజన్ కావడంతో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. అయినప్పటికీ భక్తులకు సుఖదర్శనం కోసం అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని బోర్డు తెలిపింది. ఆలయం వెనుక మాలికాపురంలోని అన్నదాన భవనం ఆసియాలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. ఇక్కడ రోజూ పది వేల మందికి పైగా భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు అన్నదానం స్వీకరించారు.అన్నదానం కోసం మొత్తం 235 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పెషల్ ఆఫీసర్ సునీల్ కుమార్ తెలిపారు. భక్తులు కడిగిన ప్లేట్లు, గ్లాసులను వేడినీటితో డిష్వాషర్లలో మళ్లీ శుభ్రం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కొత్త మెనూ మార్పు భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంచుతుందని బోర్డు భావిస్తోంది.