హైదరాబాద్ వాసుల మనసుకు ఊరట—జీహెచ్ఎంసీ భద్రతా పెద్ద నిర్ణయం!
పయనించే సూర్యుడు న్యూస్ :జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పాదాచారుల భద్రత, సదుపాయం మెరుగుపర్చడం కోసం.. రహదారులను సుందరంగా ఉంచడం లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1.68కోట్ల రూపాయలతో మోడల్ ఫుట్పాత్ అభివృద్ధి పనులు ప్రారంభించింది. పాదాచారులకు ఎండ తగలకుండా, రక్షణగా ఫుట్పాత్ పైభాగంలో (రూఫ్టాప్) 10కే డబ్ల్యూసీ సామర్థ్యం కలిగిన సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు.జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్నగర్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఈ మోడల్ ఫుట్పాత్ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ అధికారులు ప్రారంభించారు. రామానాయుడు స్టూడియో (రోడ్ నెం.79/82 జంక్షన్) నుంచి బీవీబీ జంక్షన్ (సీవీఆర్ ఛానల్, రోడ్ నెంబ. 82) వరకు పాదాచారుల రద్దీ అధికంగా ఉండే 1500 మీటర్ల మేర ఈ పనులు చేయనుంది. ఇందులో ఎడమ వైపు వెయ్యి మీటర్లు, కుడివైపు 5వందల మీటర్ల మేర మోడల్ ఫుట్పాత్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 1.68కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పనులు నాలుగు నెలల్లో పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ మోడల్ ఫుట్పాత్లకు మరో ప్రత్యేకత ఉంది. దివ్యాంగులు, దృష్టిలోపం ఉన్నవారు, వృద్ధులకు ఉపయోగపడేలా టాక్లైల్ పేవర్లు (స్పర్శ సంబంధిత) గైడ్బార్లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా అందరికీ ఈ మోడల్ ఫుట్పాత్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫుట్పాత్ నిర్మాణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారైన పేవర్బ్లాకుల్ని వినియోగిస్తున్నారు. తద్వారా భారీగా ప్లాస్టిక్ వ్యర్థాల రీసైకిల్.. పర్యావరణ పరిరక్షణకు ఉపకరిస్తుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ మోడల్ ఫుట్పాత్లో మరో ప్రత్యేకత ఏమిటంటే.. పాదాచారులకు ఎండ తగలకుండా, రక్షణగా పుట్పాత్ పైభాగంలో 10కే డబ్ల్యూపీ సామర్థ్యం కలిగిన సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ గ్రిడ్కు చేరుతుందని అధికారులు తెలిపారు.