PS Telugu News
Epaper

జగన్ డైరెక్ట్ అటాక్! “క్రెడిట్ చోర్ చంద్రబాబు” అన్న ట్వీట్ దుమ్మురేపింది!

📅 13 Nov 2025 ⏱️ 2:56 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో ‘క్రెడిట్ చోరీ స్కీం’ విజయవంతంగా నడుస్తుందంటూ చురకలు అంటించారు. క్రెడిట్ చోర్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్ తో వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.జగన్ పోస్టు ప్రకారం.. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా.. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా.. ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా.. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైయస్సార్‌సీపీ గతంలో శాంక్షన్‌ చేయించిన ఇళ్లను, వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని ఇళ్లన్నీ మేమే కట్టేశాం.. ఆ క్రెడిట్‌ కూటమి ప్రభుత్వానిదే అంటూ క్రెడిట్‌ చోరీ స్కీం హేయంగా ఉంది చంద్రబాబు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు అంటూ జగన్ విమర్శించారు.మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకూ మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్‌ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలోఉన్నవే. ఇవికాక, 12 అక్టోబరు 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా… అసలు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం! అంటూ చంద్రబాబు తీరుపై జగన్ మండిపడ్డారు.

Scroll to Top